న్యూఢిల్లీ, మార్చి 28: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ)పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతుండటం వీరిలో ఆందోళన నెలకొన్నది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన వీరు ప్రస్తుతం వీటిని వెనక్కి తీసుకునే పనిలో పడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే నెల రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించుకుపోయారు. మార్చి నెలలో ఏకంగా రూ.1,12,244 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు నేషనల్ సెక్యూరిటీస్ అండ్ డిపోజిటరీర్స్ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) తాజా గా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఒక నెలలో రికార్డు స్థాయిలో నిధులను వెనక్కి తీసుకోవడం ఇదే తొలిసారి. గతంలో అక్టోబర్ 2024లో రూ.94,017 కోట్ల తరలింపు తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. ఈక్విటీలతోపాటు డెబిట్, క్రెడిట్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు రూ.1,23,688 కోట్ల విక్రయాలు జరిపారు. అలాగే జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో రూ.1,15, 124 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్ఐఐలు.. ఆ మరుసటి నెలలో రివర్స్గేర్ను వేశారు. ఇదే సమయంలో ఎఫ్ఐఐలు మ్యూచువల్ ఫండ్లలో రూ.1,398 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం.
ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ముందు వరుసలో భారత్ ఉండటంతో విదేశీ మదుపరులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఈక్విటీలు కుప్పకూలే ప్రమాదం ఉన్నదని గుర్తించిన ఎఫ్ఐఐలు..ముందుగానే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రంగాలవారీగా చూస్తే ఆర్థిక సేవల రంగాల్లో పెట్టుబడుల్లో రూ.31,831 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు..ఆటోమొబైల్ రంగం నుంచి రూ. 4,807 కోట్లను ఉపసంహరించుకున్నట్టు నివేదిక వెల్లడించింది.
ఇదే సమయంలో క్యాపిటల్ గూడ్స్లో రూ.3,897 కోట్ల పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపరులు..కెమికల్స్, కన్జ్యూమర్ సర్వీసెస్, మెటల్, మైనింగ్ రంగాల్లో రూ.1,000 కోట్ల నిధులను చొప్పించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ల ఫలితాల ఆధారంగా విదేశీ మదుపరులు దృష్టి సారిస్తున్నారని, వీటికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా పెట్టుబడుల ఉపసంహరణకు కారణాలని బీఎన్పీ పరిబాస్ వెల్లడించింది.