న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సోమవారంనుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. అయితే, పాఠశాలలు తెరిచినా కూడా ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలను బడికి పంపొద్దని ఏ పాఠశాల ఒత్తిడి తేవొద్దని స్పష్టం చేసింది. గతవారం నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తెరిచేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) ఉత్తర్వు జారీ చేసింది. పాఠశాలల్లో 50 శాతానికి మించకుండా హాజరు ఉండేలా చూడాలని ఆదేశించింది.
ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, ప్రత్యేక భోజన విరామాలు, ప్రత్యామ్నాయ సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కంటైన్మెంట్ జోన్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాఠశాలకు రావడానికి అనుమతి నిరాకరించింది. ఇదిలా ఉండగా.. పాఠశాలలు తల్లిదండ్రులకు అనుమతి పత్రాలు పంపేందుకు పనిలో ఉన్నాయి. తల్లిదండ్రులకు సమ్మతి పత్రాలను పంపినట్లు మయూర్ విహార్లోని విద్యా బాల్ భవన్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్బీర్ తెలిపారు.
అయితే, చాలా మంది తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు అందలేదు. అదే సమయంలో సమ్మితి పత్రాలు అందించిన తల్లిదండ్రులు మాత్రం ఛత్పూజ అనంతరం పాఠశాలలను తిరిగి తెరువాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు సెప్టెంబర్లో 9-12 తరగతులకు పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. గతేడాది కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 9-12 తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఆ తర్వాత మళ్లీ వైరస్ విజృంభించడంతో మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
పాఠశాలలను తిరిగి ప్రారంభించిన క్రమంలో పలు పాఠశాలలను విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలను పునః ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తున్నట్లు చెప్పారు.