మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖం అని అంటున్నాం. రెండిటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మికత. ప్రకృతిలో మార్పు సహజం. ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్య జీవనం సాగించక తప్పదు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తనను బట్టే మనకు శత్రువులైనా, మిత్రులైనా ఏర్పడతారు. అంటే మన మిత్రుడు, శత్రువు.. ఇద్దరూ మనలోనే ఉన్నారు.
కోపం, లోభం, అసూయ, స్వార్థం, కామం, అహంకారం ఇవన్నీ మనలోని శత్రువులు. వీటి వల్లనే ఎదుటివారు మనకు శత్రువులు అవుతుంటారు. పరమాత్మ మన నిజమైన శత్రువు ఎవరో చెప్పారు. కామ, క్రోధాలను తృప్తిపరచడం అసాధ్యం. రజోగుణం వల్ల ఇంద్రియాల మీద నిగ్రహం కోల్పోతారు. ఇవి పరిపరివిధాలా పరుగులెత్తినప్పుడు పరిమితి లేని కోరికలు మనలో పుడతాయి. ఇదే కామం అంటే! ఈ కామం తీరనప్పుడు క్రోధం ఏర్పడుతుంది. పోనీ, ఒకవేళ కోరిక తీరినా మరో కోరిక సిద్ధంగా ఉంటుంది. ఇలా అంతులేని కోరికల ఫలితం..! మనిషి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసుడిగా మారి ఈ జీవితపు నిజమైన విలువను గ్రహించలేకపోతాడు. ఈ గుణాలే మనిషిని పాపం వైపుగా నడిపించే శత్రువులని తెలుసుకోవాలి. కాబట్టి, వీటంతటికీ మూలం అయిన రజోగుణాన్నీ, దాని ఫలితంగా ఏర్పడే కామ, క్రోధాలను శత్రువులుగా గ్రహించమని హెచ్చరించాడు పరమాత్మ.
ఏ పురాణాలు చదివినా, చరిత్ర తిరగేసినా కామం కారణంగా ఎందరో పతనమయ్యారు. మనలో ఉన్న కామం సృష్టిని నడిపిస్తున్న గొప్ప గుణం! అది లేకపోతే సృష్టి ఆగిపోతుంది. కానీ, అది మితిమీరితే మానవత్వాన్ని కోల్పోయి, పశుత్వంతో మనల్ని మనం నాశనం చేసుకుంటూ, ఎదుటివారిని కూడా నాశనం చేసే దుర్గుణంగా పరిణమిస్తుంది. అందుకే, పరమాత్మ చెప్పినట్టు మనలో ఉన్న శత్రువును అదుపులో పెట్టుకోకపోతే, మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే!
ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి తక్కువ వాడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. పూర్వ జన్మ కర్మల ఫలితంగా రావలసిన సమయంలో దుఃఖాలు రాక తప్పదు, వాటంతటవే వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా.. తిరిగి ఎప్పుడు సుఖం వస్తుందా.. అని ఎదురుచూస్తాడు. ఎదురుచూడటమే కాదు, ఆ సుఖం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమిస్తాడు. ఫలితంగా దుఃఖాలు పోవచ్చు, తాత్కాలిక సుఖాలు రావచ్చు. కానీ ఆ సుఖాలు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఆ సుఖాలు దూరమై, మళ్లీ దుఃఖాలు వస్తాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా మానవుడు తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే, అందుకే తాను కోరుకున్న సుఖాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు.
అందుకే జీవితమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది. నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది పూర్తిగా వదులుతుంది. ఇలలోని దేహాన్ని, కలలోని దేహ భావనను వదిలి ఉండాల్సిన సత్య వస్తువుతో ఉండాలి. ఆ సత్య వస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మనం అది తెలుసుకోవటానికే రుషులు, మహర్షులు యోగ సాధనను తెలియజేశారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగాన్ని వారు నిరంతరం సాధన చేసి, మనకు అందించారు. వాటిని పాటించి శాశ్వతమైన ఆనందాన్ని మనమూ పొందవచ్చు.
– భువనగిరి కిషన్ యోగి
85198 34758