వికారాబాద్, ఏప్రిల్ 10 : కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతగిరి గుట్టలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, నీటిని తాగేందుకు వచ్చిన మూగజీవాలను వేటాడి చంపుతున్నాయన్నారు. కుక్కలను పట్టుకోవాలని మున్సిపల్ అధికారులకు పలు మార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.
జింకను కుక్కలు వెంబడిస్తున్న దృశ్యాలు గమనించిన కొందరు స్థానికులు, బర్డ్స్ వాచర్స్ కుక్కల వేట నుంచి జింకను కాపాడే ప్రయత్నం చేశారు. వికారాబాద్ జిల్లా అటవి శాఖ అధికారికి సమాచారం ఇవ్వడంతో అటవి శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జింక మృతి చెందింది. మృతి చెందిన జింకను అటవి శాఖ అధికారులు తీసుకెళ్లారు.