హైదరాబాద్ : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదీపై ఉన్న ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 2,35,387 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,76,019 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. నాలుగు గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగుల నీరుంది. డ్యామ్ పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.91 టీఎంసీలు ఉన్నది. ఎగువన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. 25 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని 3,46,405 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నిలువ 9.657 టీఎంసీలకు 7.389 టీఎంసీలు నిల్వ ఉన్నది.