హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసి, తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్గా మారుస్తాం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్భాటపు ప్రకటన ఇది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు పరుగులు పెట్టగా.. కాంగ్రెస్ హయాంలో రివర్స్ అయ్యింది. ఏటికేడు సాగు లక్ష్యంతోపాటు సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గుతున్నది. సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా, వారికి సరైన మార్గనిర్దేశనం లభించడం లేదని చెప్తున్నారు. ఉద్యానశాఖ, ఆయిల్ఫెడ్ వైఫల్యమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత నాలుగేండ్ల సాగు విస్తీర్ణం గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు తగ్గుతున్నదని స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటికేడు తగ్గిపోతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 82,372 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించగా, కాంగ్రెస్ హయాంలో 47వేల ఎకరాలకు పడిపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో.. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 82,372 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యింది. ఆ తర్వాత ఏడాది 2023-24లో 59,261 ఎకరాలుగా నమోదైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తగ్గుదల నమోదైంది. 2024-25లో 40,247 ఎకరాల్లో మాత్రమే సాగుకాగా, 2025-26లో 47,547 ఎకరాలుగా నమోదైంది. క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచాల్సిన ఉద్యానశాఖ, ఆయిల్ఫెడ్ వైఫల్యానికి ఇదే నిదర్శనమని చెప్తున్నారు.
సాధారణంగా లక్ష్యం పెద్దదిగా ఉంటే వీలైనంత ఎక్కువగా సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా లక్ష్యాన్ని తగ్గించుకుంటే.. సాధించేది కూడా తగ్గిపోతుంది. ఆయిల్పామ్ సాగులో ఇదే కనిపించింది. ఉద్యానశాఖ, ఆయిల్ఫెడ్ సంస్థలు తమ సాగు లక్ష్యాన్ని క్రమంగా తగ్గించుకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏటా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకునేవారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏటా లక్ష ఎకరాలకు తగ్గించుకున్నారు. ఈ ఏడాది మరింత తగ్గించారు. ఉద్యానశాఖ 2024-25లో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా, 40 శాతం చేరుకున్నది. 2025-26లో లక్ష్యాన్ని 1.25 లక్షల ఎకరాలుగా నిర్దేశించగా, 38 శాతం చేరుకున్నది. దీంతో 2026-27లో సాగు లక్ష్యాన్ని దారుణంగా తగ్గించేసింది. ఈ ఏడాది 85వేల ఎకరాల్లో మాత్రమే సాగు లక్ష్యం నిర్దేశించుకున్న ది. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే కొనసాగితే 10 లక్షల ఎకరాల లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంతో పాటు రైతులకు రెగ్యులర్గా ఆదాయం వచ్చే పంటలను ప్రోత్సహించడంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఆయిల్పామ్ సాగును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. అధికారులను క్షేత్రస్థాయిలో మోహరించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రైతులు ముందుకొచ్చారు. అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు కాతకొచ్చాయి. రైతులకు భారీగా డబ్బులు చేతికి వస్తున్నాయి. దీంతో మిగతా రైతులు సైతం ఆయిల్పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలను గాలికొదిలేశారని, సాగు పెంచే భారాన్ని కంపెనీలకు, క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించి వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ఫెడ్లో కీలక అధికారులు అంతర్గత కుమ్ములాటల్లో పడి అసలు పనిని విస్మరించారని ఇతర అధికారులు ఆరోపిస్తున్నారు.
