నల్లగొండ : ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. ఆమెతో తన కలల ప్రపంచాన్ని పంచుకున్నాడు.. ఆనందంగా గడిపాడు. ఆ నూతన దంపతులిద్దరూ అలా గాల్లో విహరిస్తూ కెనడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ఆ నవ వరుడిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. అయితే తను వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా, నేవిగేషన్ యాప్ను అనుసరించి వెళ్లడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన ఆడప పృథ్వీ(29) కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. గత నాలుగేండ్ల నుంచి పృథ్వీలో కెనడాలో ఉంటున్నాడు. అక్కడే విజయవాడకు చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించారు. దీంతో మే 29న విజయవాడలో పృథ్వీ, భార్గవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ నవ దంపతులు కొద్దిరోజుల పాటు విజయవాడలోనే ఉన్నారు. ఇక శనివారం వీరు కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో పృథ్వీ జూన్ 8న కోదాడకు తిరిగొచ్చాడు. అయితే వేరే పని నిమిత్తం పృథ్వీ తన తండ్రి రాజేందర్తో కలిసి గురువారం నాడు.. నకిరేకల్ మీదుగా హాలియాకు బయల్దేరాడు. నరసరావుపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. పృథ్వీ కారును గోరెంకలపల్లి వద్ద ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. పృథ్వీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి రాజేందర్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
అయితే కోదాడ నుంచి హాలియా వెళ్లేందుకు రూట్ కోసం పృథ్వీ నేవిగేషన్ యాప్ను అనుసరించాడు. నకిరేకల్ వరకు ఎన్హెచ్ 167 మీదుగా చేరుకున్నాడు. అక్కడ్నుంచి తిప్పర్తి మీదుగా సింగిల్ రోడ్డులో హాలియా బయల్దేరాడు. గోరెంకలపల్లి వద్ద అపోజిట్ డైరెక్షన్లో వస్తున్న కరీంనగర్ ఆర్టీసీ డిపో బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది.
కోదాడ నుంచి హాలియా వెళ్లాలంటే షార్టెస్ట్ రూట్ ఒకటుంది. అదేంటంటే.. హుజుర్నగర్, మిర్యాలగూడ మీదుగా హాలియా చేరుకోవచ్చు. ఈ రూట్ కేవలం 83 కిలోమీటర్లు మాత్రమే. కానీ పృథ్వీ సూర్యాపేట మీదుగా నకిరేకల్ నుంచి హాలియా వచ్చేందుకు యత్నించాడు. ఈ మార్గం 130 కిలోమీటర్లు ఉంది. అయితే నేవిగేషన్ యాప్ను అనుసరించడం వల్లే పృథ్వీని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది.