“నేను పుట్టింది కరీంనగర్ మిషన్ హాస్పిటల్లోనే. లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న సరస్వతీ శిశు మందిర్లో ఒక సంవత్సరం చదువుకున్న. అ తర్వాత సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్లో రెండేళ్లు చదువుకున్న. తిరందాజ్, వెంకటేశ్వర థియేటర్లలో సినిమాలు చూసిన. మీ లెక్క బడి ఎగ్గొట్టలే తమ్మీ.. బడి అయిపోయినంక సినిమాలు చూసిన. సినిమాలు అనంగనే ఈలలుగొట్టుడే. అట్లా కరీంనగర్తో నాకు అనుబంధం ఉన్నది.”
తెలంగాణ.. దేశంలోనే ముందంజలో ఉన్నది. కరెంట్, సాగు, తాగునీటి సరఫరా, గ్రామీణులకు అందించే సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు నీతి ఆయోగ్ నివేదికే సాక్ష్యం. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలవల్లే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు కరీంనగర్ ఎట్లుండేది? ఇప్పుడు ఏ విధంగా రూపుదిద్దుకున్నది. అంతా మీ కండ్ల ముందే కనిపిస్తున్నది. ప్రజలారా ఆలోచించండి. ప్రగతిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నదెవరో.. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాద్ధాంతం చేస్తున్నదెవరో గుర్తించాలి.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
“బీజేపీ నాయకులు మాట్లాడే ప్రతీది డొల్ల మాటే. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకులతోపాటు కేంద్ర ప్రభుత్వ మంత్రులు అసమర్థులు.. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓటమి పొందిన బండి సంజయ్ అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్లుగా అదృష్టవశాత్తు ఆనాడు ఏదో గాడ్పు వల్ల ఎంపీగా గెలిచి తంతే గారెల బుట్టలో పడ్డట్టు రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నడు. దీనికే ఆయన ఆగుడే లేదు.. నీలుగుడే నీలుగుడు.. బండి సంజయ్ బాగా మాట్లాడుతున్నావ్ కదా.. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలిచి చూపించు. కరీంనగర్ వేదికగా సవాల్ విసురుతున్నా.. కరీంనగర్ ప్రజలారా మీకు 24 గంటల పాటు ఒక అన్నగా, తమ్ముడిగా అందుబాటులో ఉండే గంగులను వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించి మళ్లీ శానసనభకు పంపించాలి” అని విజ్ఞప్తి చేశారు. అలాగే, జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆరంభంలోనే మంత్రి గంగులపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి, ఒక బలమైన నాయకుడు ఉంటేనే బలహీన వర్గాలు కూడా బలవంతులు అవుతారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మీ అందరి అభిమాన నాయకుడు మన అన్న కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ను మంత్రి చేశారు. ఆ రోజు నుంచి బలహీనవర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు’అని పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే..
కరీంనగర్ను సీఎం కేసీఆర్ ఒక లక్ష్మీనగర్ మాదిరిగా చూసుకుంటారు. ఇక్కడ ఏ పని మొదలు పెట్టినా మొత్తం రాష్ట్రమంతటా విజయవంతం అవుతుందనే బలమైన విశ్వాసం ఆయనది. అందుకే 2001లో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినపుడు మొట్టమొదటి సింహగర్జన సభ 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో శంఖారావం పూరించాం. ఈ రోజు మీ అందరి దయతో, ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చింది. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని పోతున్నది.
మానేరు డ్యాంపై గతంలో ఒకటే ఒక బ్రిడ్జి ఉండేది, ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించుకున్నాం. మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లో లేని విధంగా అంతర్జాతీయ నగరాల్లో ఉండేలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఘనత ఆయనకే దక్కుతుంది. దాంతోపాటు రూ.410 కోట్లతో డ్యాం నుంచి కింద సదాశివపల్లి దాకా బ్రహ్మాండమైన మానేరు రివర్ ఫ్రంట్ పనులకు ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం. నగరంలోని మా ఆడబిడ్డలందరూ ఈసారి అక్టోబర్ నెలలో వచ్చే బతుకమ్మను కచ్చితంగా మానేరు రివర్ ఫ్రంట్లో నిర్మించే ఘాట్లపైనే ఆడుకోవాని విజ్ఞప్తి చేస్తున్న. ఒక చెక్ డ్యాం నిర్మించుకుని 12 ఫీట్ల నీళ్లు ఆపి ఘాట్ల నిర్మాణం చేసి మానేరు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. 3.7 కిలో మీటర్ల తీరం వెంట అంతర్జాతీయ స్థాయి డిజైన్ సంస్థలతో పనులు చేస్తాం. అలాగే, రూ.615 కోట్లతో చేపట్టే పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేస్తాం.
ఉగాదికి డబుల్ బెడ్ రూంలు
కరీంనగర్లో 1600 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైతే 1460 పూర్తయ్యాయి. ఉగాది తర్వాత 600 ఇండ్లు అర్హులకు ఇస్తాం. బడ్జెట్లో సీఎం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తాం. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఈ బడ్జెట్లో మంజూరు చేశాం. కరీంనగర్ ప్రత్యేకం కాబట్టి అవసరమైతే ఇంకో రెండు మూడు వేల ఇండ్లు అదనంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. 57 ఏండ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పాం. మే, జూన్ నెల నుంచి కొత్త పెన్షన్లు వస్తాయి. కరీంనగర్లో 7 నుంచి 8 వేల మందికి రానున్నాయి.
ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కల, యువతీయువకులు కరీంనగర్లో మెడికల్ కళాశాల కావాలని కోరుతున్నరు. ఇక్కడ రెండు ప్రైవేటు కళాశాలలున్నా.. ఈ ప్రాంత ప్రజల కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి మంజూరు చేసిండ్రు. వచ్చే సంవత్సరం కరీంనగర్లో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుంది. మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత మీరు ఎక్క డో ఉక్రెయిన్కో, పిలిప్పిన్స్కో, చైనాకో, ఇంకో దేశానికో వెళ్లి మెడిసిన్ చదువుకునే అవసరం ఉండదు.. బ్రహ్మాండంగా ఇక్కడే చదువుకోవచ్చు. ప్రతి జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే ఈరోజు తెలంగాణ వ చ్చిన తర్వాత 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్దే. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, ఎల్ రమణ, రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, సీపీ సత్యనారాయణ, స్టేట్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి, ఏబీసీడీవో రాజమనోహర్రావు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్, నగర కమిషనర్ ఇస్లావత్ సేవా, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒకప్పుడు తెలంగాణ వస్తే ఏమొస్తదన్నరు. ఈ ఒక్క రోజే రూ.వేయి కోట్ల పై విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నం. అన్ని పెన్షన్లు పెరిగినయి. ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామంటే అది మా కమిట్మెంట్. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూ డింటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎల్ఎండీ నుంచి కిందికి నీళ్లియ్యాలె అన్నపుడు ఇదే మంత్రి గంగుల కమలాకర్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నీళ్లు ఇవ్వాలని అడ్డంపడ్డరు. మాకు మంచి నీళ్లు ఇవ్వకుండా కిందికి నీళ్లెట్లిస్తరని లొల్లి పెట్టుకున్నరు. ఈరోజు ఆ బాధ లేదు. ఆ గోస లేదు. ఇంటింటికీ నల్లా పెట్టి, ఇది పల్లెనా, పట్టణమా.. అన్న తేడా లేదు. సుమారు రూ.46వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నీళ్లిచ్చిన దేశంలోనే మొదటి రాష్ట్రం మనది. జూలై 2020లో ఇదే కరీంనగర్లో ప్రతిరోజూ నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దిగ్విజయంగా కొనసాగుతోంది. 5 వేల కలెక్షన్లకు 24/7 నీళ్లు ఇచ్చేందుకు గురువారం శంకుస్థాపన చేశాం. నగరంలో 52 వేల కనెక్షన్లు ఉన్నాయి. అన్నింటికీ 24/7 గంటల నీళ్లిచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వానిదే. దాని కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెడతామని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.