లక్నో, జనవరి 19: ఉత్తరప్రదేశ్లో గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ తలెత్తని ప్రశ్న ఇప్పుడు వస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్నదే ఆ ప్రశ్న. 1990ల్లో కాన్షీరామ్ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఉత్తప్రదేశ్ రాజకీయాల్లోకి దూసుకొచ్చినప్పటి నుంచి దళితులు ఆ పార్టీకే అండగా ఉంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ ప్రభావం అంతగా లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం సంగతి పక్కన పెడితే.. కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి దళితుల ఓట్లు బీఎస్పీకి కాకుండా వేరే పార్టీకి పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆ ఓట్లతో లాభపడే పార్టీ ఏదని ఆలోచిస్తే అన్ని విశ్లేషణలు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) వైపే మొగ్గు చూపుతున్నాయి.
ఓబీసీ నేతల ప్రభావం
యూపీ మొత్తం జనాభాలో దళితులు 21.6 శాతం. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరు. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా దళితుల్లో ఒక వర్గమైన జాతవుల మెప్పు చాలా అవసరం. మొత్తం దళిత ఓట్లలో వీరివే 55%. అయితే ఈ జాతవులతో పాటు దళితులెవరూ బీజేపీకి ఓట్లు వేయబోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయంగా చూస్తే యూపీ దళితులు ఎప్పుడూ బీజేపీ వైపు లేరు. పైగా యోగి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. ఈ కారణాల వల్ల దళితులు బీజేపీకి ఓటేయకపోవచ్చని చెప్తున్నారు. దీంతో పాటు ఇటీవల బీజేపీ నుంచి బయటికి వచ్చిన ఓబీసీ నేతల ప్రభావం కూడా దళితులపై ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సహా ముగ్గురు మంత్రులు ఇటీవల సమాజ్వాదీ పార్టీలో చేరారు. వస్తూ వస్తూ వారంతా చేసిన ఆరోపణ.. ‘బీజేపీ దళితులను, వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు’ అనే.
ముఖాముఖి పోరే
ప్రస్తుతం యూపీలో గతంలో లేని విధంగా ముఖాముఖి(బీజేపీ-ఎస్పీ) పోరు ఉన్నది. ఈ నేపథ్యంలో తమ కోర్ ఓటు బ్యాంకు అయిన దళిత ఓట్లను మాత్రమే రాబట్టుకోవడం ద్వారా బీఎస్పీ పెద్దగా సీట్లు సాధించకపోవచ్చు. అదే సమయంలో ఎస్పీకి వెళ్లే ఓట్లను అడ్డుకోవడం ద్వారా బీజేపీకి మేలు జరగవచ్చు. ఇది దళితులకు ఇంకా ప్రమాదం. ఈ ఆలోచనతోనే మాయావతి ఈ ఎన్నికల్లో సైలెంట్గా ఉంటున్నారని, తద్వారా దళితులు ఎస్పీకి ఓటు వేసేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎప్పటిలాగే హిందూత్వ ఎజెండా
ఓబీసీలతో పాటు దళితులను ఆకర్షించడానికి బీజేపీ ఎప్పటిలాగే హిందూత్వ ఎజెండాను ఎత్తుకొన్నది. యోగి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నది. అంతే కాకుండా ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో 19 మంది దళితుల పేర్లను ప్రకటించింది. వారిలో 13 మంది జాతవులే.