నిజామాబాద్, జనవరి 29: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ఘటనలో నిజామాబాద్ సీపీ నాగరాజు పాత్ర ఉన్నదంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ నోటికొచ్చినట్టు మాట్లాడటం వివాదాస్పదమవుతున్నది. గురువారం నందిపేట కార్యక్రమంలోనూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్లు మరోమారు సీపీని టార్గెట్ చేస్తూ నిందించడంపై దళిత సంఘాల నేతలు కన్నెర్ర చేశారు. ఇరువురు ఎంపీలు తక్షణమే బేషరతు క్షమాపణలు చెప్పాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. దళితులను కించపరిచేలా మాట్లాడుతున్న సీపీ నాగరాజు పర్యవేక్షణ లోపం వల్లే ఇస్సాపల్లి ఘటన జరిగిందని అర్వింద్ ఆరోపించడాన్ని మాల విద్యార్థి సంఘం, తెలంగాణ మాల మహానాడు, మాల మహానాడు, దళిత సంఘాల నాయకులు ఖండించారు. శనివారం అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎంపీపై ఫిర్యాదు చేశారు.
అర్వింద్ను తిరగనియ్యం
దళిత ఐపీఎస్ అధికారి నాగరాజును టార్గెట్ చేస్తూ బీజేపీ ఎంపీ, ఇతర నాయకులు నిందలు మోపడం సరైంది కాదు. దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్వింద్ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయనను తిరగనియ్యం.
– పులి జైపాల్, తెలంగాణ మాలమహానాడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
అర్వింద్కు బుద్ధిచెప్తాం
ఇష్టానుసారంగా సీపీ నాగరాజును అర్వింద్ దూషించడం సరికాదు. సీపీకి క్షమాపణ చెప్పాలి, లేదంటే బుద్ధి చెప్తాం.
– నీలగిరి శ్రీనివాస్, మాలమహానాడు యూత్ ప్రెసిడెంట్, నిజామాబాద్ జిల్లా