హుజూరాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట మండల ఇంచార్జ్ సుంకే రవిశంకర్ అన్నారు. హుజూరా బాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో మంగళవారం ఆయన దళితులతో సమావేశం అయ్యారు.
తెలంగాణ దళితబంధు పథకం దేశానికి ఆదర్శమని, దళితుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నవశకానికి మరో అంబేద్కర్ అయ్యారని రవిశంకర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం దళిత సాధికారిక పథకం అమలు చేస్తున్నారని అన్నారు. సబ్బండ వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
గతంలో దళితులను ను ఓట్లు వేసే యంత్రాలుగా పరిగణించే వారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఈర్షపడుతున్నాయని రవిశంకర్ విమర్శించారు. ప్రతి దళిత బిడ్డ పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థి పై లక్షా 25 వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తుందన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. దళిత బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ లుగా, సివిల్స్లో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా దళితులు ఎవరి మీద ఆధారపడకుండా తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చని భరోసానిచ్చారు. దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ కానే కాదని, ఇది దళితులను బాగు చేసే స్టంట్ అని స్పష్టం చేశారు. అందుకే ప్రతిపక్షాలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగం కావద్దని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని తమ జీవితంలో వెలుగులు నింపుకోవాలని సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్పంచ్ కలాల రాజిరెడ్డి, కల్లెం తిరుపతి రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రవి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.