హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్రికెట్ అభిమానులకు పలు సూచనలు చేసింది. ఐపీఎల్( IPL) క్రికెట్ మ్యాచ్ల టికెట్ మోసాలపై (Cricket Ticket Scams) జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు , టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు , అనధికారిక ఏజెంట్ల ద్వారా నకిలీ ఐపీఎల్ టికెట్ మోసాలు పెరుగుతున్నాయని తెలగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ( Director Shikha Goel ) వెల్లడించారు.
సైబర్ మోసగాళ్లు వీఐపీ, వీవీఐపీ పాస్లు, భారీ డిస్కౌంట్లు, చివరి నిమిషం టికెట్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. అనేక సందర్భాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు తీసుకుని నకిలీ టికెట్లు పంపించడం, డబ్బుతో పరారు అవుతున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ టికెట్బుకింగ్లకు డిస్ట్రిక్ట్ యాప్ అధికారిక టికెటింగ్ భాగస్వామిగా గుర్తించాలని సూచించారు.
అభిమానులు టికెట్ల కోసం చెల్లింపు ముందు వెబ్సైట్ యూఆర్ఎల్ను తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. తెలియన ఏజెంట్లు లేదా సోషల్ మీడియా విక్రేతల ద్వారా టికెట్లు కొనవద్దని, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు , స్క్రీన్షాట్లు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని, cybercrime.gov.in అనే వెబ్సైట్కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.