Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ఏరియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్బంగా ఘర్షణ, హింసాత్మక వాతవరణం ఏర్పడింది. ఒక మసీదును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండటంతో కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని, రైల్వే భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం నుంచి కూల్చివేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. అక్కడ ఉన్న ఒక అక్రమంగా వెలసిన మసీదును కూల్చేస్తుండగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు, ఇతర బలగాలు అక్కడికి చేరుకుని ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి, వారిని చెదరగొట్టారు. ఇలా పలుసార్లు రాళ్లు రువ్వగా ప్రతిసారీ వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మళ్లీ ఎలాంటి ఘర్షణలు జరగకుండా, శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నారు. రాళ్లు రువ్వి, ఘర్షణలకు కారణమైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ముంబై అధికారులు ఇక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. 500 వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ కూల్చివేతల ద్వారా 5,300 చదరపు మీటర్ల స్థలం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో రైల్వేకు సంబంధించిన భారీ కాంప్లెక్సులు నిర్మించబోతున్నారు.