Cyber Crime | సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశపడిన కొందరు బ్యాంకు ఖాతాలు అప్పగించి.. పోలీసు కేసుల్లో చిక్కుకొని నేరస్తులుగా మారుతున్నారు.
దుబాయ్ అడ్డాగా నేడు చైనా సైబర్నేరగాళ్లు మోసాలు చేయడంలో ఆరితేరిపోయారు. ఎక్కడికక్కడ కమీషన్ ఏజెంట్లను నియమించుకుంటూ.. సైబర్దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు.. నేరగాళ్లకు ఖాతాలిచ్చిన ఐదుగురు బ్యాంకు ఖాతాదారులను అరెస్టు చేశారు. వీరంతా దుబాయ్లో సైబర్నేరగాళ్ల ట్రాప్లో పడటం గమనార్హం.
ఉత్తర, ఈశాన్య భారతదేశంలో రూ.10 వేలకు బ్యాంకు ఖాతాలు కొంటున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. నెమ్మదిగా దక్షిణ భారతదేశంలోనూ సైబర్నేరగాళ్ల తమ నేరాలకు కావాల్సిన బ్యాంకు ఖాతాలను సమకూర్చుకుంటున్నారు. ఏకంగా వాట్సాప్, టెలీగ్రామ్లో ప్రకటనలిస్తూ.. తమకు బ్యాంకు ఖాతాలు కావాలని, కమీషన్ ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం విదేశాల్లో పనిచేసే భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సైబర్నేరగాళ్లు నేరుగా ఎక్కడ కూడా తమ వివరాలను వెల్లడించడంలేదు. మధ్యవర్తుల ద్వారానే అన్ని పనులు కొనసాగిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా దుబాయ్లో పనిచేసే వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒక్కో బ్యాంకు ఖాతాకు అక్కడి మధ్యవర్తులు ఒక రేటు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మధ్యవర్తులు అక్కడ పనిచేసే భారతీయులను సంప్రదిస్తారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, తెలిసిన వారి ద్వారా బ్యాంకు ఖాతా తెరిచి తమకు ఇస్తే ఒక్కో ఖాతాకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు కమీషన్ ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. డబీర్పురకు చెందిన ఆరీఫ్ సైఫీ 2009లో సౌదీకి వెళ్లాడు. సివిల్ పనులు చేస్తున్నాడు. అతడికి బ్యాంకు ఖాతాలు తెరిపించే యూపీ, పంజాబ్కు చెందిన జైహిద్, సందీప్సింగ్ పరిచయమయ్యారు. తమకు ఇండియాలో బ్యాంకు ఖాతాలు కావాలని, క్రిప్టో కరెన్సీ బిజినెస్కు అవసరమని నమ్మించారు.
ఒక్కో ఖాతాకు రూ.15 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో సైఫీ షార్జాలో ఉంటున్న చాదర్ఘాట్కు చెందిన ఫాతిమా బేగంతో మాట్లాడి.. ఈ విషయంపై చర్చించారు. ఆ తరువాత ఇద్దరు తమ వారికి రూ.10 వేలు ఇప్పించి పలువురి వద్ద నుంచి ఇండియాలో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ వివరాలన్ని సైబర్నేరగాళ్లకు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు సైబర్నేరగాళ్లు రెండు మూడు బృందాలుగా విడిపోయి, ఎవరి స్థాయిలో వారు కమీషన్లు మాట్లాడుకుంటూ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఎవరైనా బ్యాంకు ఖాతాలు తెరువాలని కోరితే.. అసలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఇతరులకు ఇవ్వవద్దని, అలా చేయడం కూడా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.