టెక్ ఫాగ్ కథనాలను అడ్డుకోవడానికే
ఈ మెయిల్ ద్వారా మాల్వేర్ అటాక్
న్యూఢిల్లీ, జనవరి 21: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ ఫాగ్’పై తమ పరిశోధనాత్మక కథనాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని డిజిటల్ మీడియా సంస్థ ది వైర్ తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా వైరస్ను పంపి పరిశోధనకు ఆటంకం కలిగించాలని చూశారని పేర్కొన్నది. ‘కథనంలో మొదటి భాగాన్ని మా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఓ వ్యక్తి ఈ మెయిల్ ద్వారా సంప్రదించాడు. పెర్సిస్టెంట్ సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పుకొన్నాడు. కంపెనీ కార్యకలాపాలపై పరిశోధనకు అవసరమైన స్క్రీన్ షాట్లు పంపుతానని చెప్పాడు. మా మెయిల్కు ఓ టోర్ లింక్(కంప్యూటర్ ఐపీ అడ్రస్ తెలియకుండా పంపే లింక్) ద్వారా 20జీబీల సమాచారం పంపించాడు’ అని వైర్ సంస్థ తాజాగా వెల్లడించింది. అదే వ్యక్తి వైర్ సంస్థ వ్యవస్థాపక ఎడిటర్లను కూడా సంప్రదించినట్టు తెలిపింది. ‘మీ ఆర్టికల్స్ చదివాను. నేను పెర్సిస్టెంట్లో పనిచేస్తాను. మీరు మీ వ్యాసంలో చూపించిన లాంటి డాక్యుమెంట్లు ఎన్నింటినో నేను ఇక్కడ యాక్సెస్ చేయగలను. మీకు వాటిని పంపే సురక్షితమైన మార్గం ఏది? మీ ఫోన్లలో ఇంకా పెగాసస్ ఉందా?’ అని ఆ వ్యక్తి ఎడిటర్లను అడిగినట్టు ది వైర్ తెలిపింది. సదరు వ్యక్తి నుంచి స్క్రీన్ షాట్లు రిసీవ్ చేసుకోవడానికి సంస్థ ప్రత్యేకంగా లైనక్స్ సర్వర్ను రూపొందించింది.
మెయిల్ పనిచేయలేదు
ఆ వ్యక్తి ఈ మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడే తమ ఈ మెయిల్ ఖాతాలోకి మాల్వేర్ను పంపినట్టు వైర్ సంస్థ తెలిపింది. ‘ఆ వ్యక్తి మాతో మెయిల్లో సంప్రదించిన మూడు రోజుల తర్వాత ప్రోటాన్మెయిల్ సెక్యూరిటీ కంపెనీ నుంచి మాకు అప్డేట్స్ వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా వైరస్ దాడి జరిగింది అని ప్రోటాన్మెయిల్ టీమ్ ధ్రువీకరించింది. టోర్లింక్లో మాల్వేర్ ఉంది అని చెప్పింది’ అని వైర్ సంస్థ వెల్లడించింది.