హైదరాబాద్ : గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల అధికారులతో డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు పడుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.
తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వివరాలను విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వివరాలు అందివ్వాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ కమల్దీప్, ఫైర్ డీజీ ఎస్కే జైన్, పీఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బోజ్జా, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, పీఆర్ కమిషనర్ రఘునందన్ రావు, ఈఐఎన్సీ మురళీధర్ రావు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.