Crime news : ఓ ఇంటి తలుపులు శుక్రవారం నుంచి మూసి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. దాంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. వారి తల్లి అపస్మారక స్థితిలో ఉంది. తూర్పు ఢిల్లీలోని పాండవ్నగర్లోని శశిగార్డెన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సదరు ఏరియాకు చెందిన శ్యామ్ (42).. శుక్రవారం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. అయితే అతని భార్య, 15 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల కుమార్తె ఇంటి నుంచి బయటికి రాలేదు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఇంటికి తాళం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులకొట్టి చూసిన పోలీసులకు విషాద దృశ్యం కంటపడింది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్యామ్ భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. శ్యామ్ తన ఇద్దరు పిల్లలను చంపడంతోపాటు భార్యపై కూడా దాడిచేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్ జాడ కోసం గాలిస్తున్నారు.