న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్)లతో కలిసి సోమవారం రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా ఓ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి గరిష్ఠంగా ఆదా చేసేలా ఈ ‘ఐఆర్సీటీసీ బీవోబీ రూపే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు’ను తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఇంధనం, పప్పు దినుసులనూ ఈ కార్డుపై కొనుక్కోవచ్చని, జేసీబీ నెట్వర్క్ ద్వారా ఏటీఎంలు, అంతర్జాతీయ వ్యాపారుల వద్ద కూడా దీన్ని వినియోగించవచ్చన్నారు. తద్వారా రివార్డు పాయింట్లను పొందవచ్చు. కాగా, కార్డుదారులు తమ లాయల్టీ నంబర్ (కార్డుపై ఉంటుంది)ను వారి ఐఆర్సీటీసీ లాగిన్ ఐడీతో అనుసంధానం చేసుకుంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్పై రివార్డు పాయింట్లను రిడీమ్ కూడా చేసుకోవచ్చు. రోజూ ఐఆర్సీటీసీ వెబ్సైట్పై రైల్వే టిక్కెట్లను బుక్చేస్తున్నవారు 6.6 కోట్ల మంది ఉన్నారని ఎన్పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. నిత్యం 7-7.5 లక్షలకుపైగా టిక్కెట్ బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్డు వీరందరికీ లాభిస్తుందన్న ఆమె.. కరోనా నేపథ్యంలో తగ్గిన రైలు ప్రయాణం కూడా పెరిగేందుకు దోహదపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.