ఇదీ కథ : భార్యాభర్తలది పేద కుటుంబం. భార్యకు పోలియో వచ్చి కాలు పనిచేయదు. భర్త మేస్త్రీ పనిచేస్తాడు. వీరికొక పాప. ఆ చిన్నారికి కూడా పోలియోతోనే పుట్టడం వల్ల కుంగిపోతారు. ఇంటికి లక్ష్మి వచ్చిందని.. ఆడపిల్లలకు సర్కారు ఎన్నో పథకాలు, సౌకర్యాలు కల్పిస్తుందని బాధపడొద్దని భార్యను ఓదార్చుతాడు భర్త.
తన బిడ్డ బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చూడాలని తండ్రి కలలు కంటాడు. ఇందుకోసం పాప పుట్టిన మూడు రోజులకే పుస్తకాలు, బొమ్మలు తీసుకొచ్చేందుకు బైక్పై వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఇక అప్పటినుంచి భార్య కూలి పనులు చేస్తూ బిడ్డను పెంచుతుంది. బిడ్డను చదివించే స్థోమత లేక ఇంటి వద్దే ఉంచుతుంది. తాను చదువుకుంటానని బిడ్డ పట్టుబట్టినా పంపదు. ఈ క్రమంలో తన బాబాయ్ నచ్చజెప్పడంతో సర్కారు బడిలో జాయిన్ చేస్తుంది. అయితే పాఠశాలలో పిల్లలు లేక బోసిపోయి ఉంటుంది. పాప మాత్రం ప్రతిరోజూ కర్రసాయంతో బడికి వెళ్లి విద్య నేర్చుకుంటుంది. ఓ రోజూ ప్రధానోపాధ్యాయుడి వద్దకు వెళ్లి పేద పిల్లలు చాలామంది ఉన్నా స్కూల్కు ఎందుకు రావడం లేదని అడుగుతుంది. డబ్బున్న వారు ప్రైవేటుకు, పేదలు కూలి పనులు చేయడం వల్ల రావడం లేదని తెలుసుకుంటుంది. ఇక అప్పటినుంచి ఆలోచనలో పడిన ఆ పాప ఎలాగైనా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చేయాలని కంక ణం కట్టుకుంటుంది.
ప్రతి పేద ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాల్లో ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ ఇతర సౌకర్యాలను వివరిస్తుంది. సర్కారు బడుల్లో చదివి ర్యాంకులు వచ్చిన వారికి ట్రిపుల్ఐటీల్లో సీట్లు, ఇతర వసతుల గురించి తెలియజేస్తుంది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 100నుంచి 300కి చేరుతుంది. అనూహ్య పరిణామంతో ఆశ్చర్యపోయిన ప్రధానోపాధ్యాయుడు.. దివ్యాంగురాలైనప్పటికీ సర్కారు బడి విలువను, అవసరాన్ని పేదలకు వివరించి పిల్లలు పాఠశాలకు వచ్చేలా చేసినందుకు అందరి ముందు అభినందిస్తాడు. ఆ తర్వాత ఆమె గురుకులంలో సీటు పొంది ఉన్నత స్థాయికి చేరుతుంది.
పేద కుటుంబంలో పుట్టిన రామకృష్ణ ప్రభుత్వ పాఠశాల విలువను అందరికీ తెలియజేసేలా ‘నేను నాబడి.. మా అమ్మానాన్న’ లఘుచిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి తానే కథ, స్క్రీన్ప్లే, మాటలు రాసి దర్శకత్వం వహించాడు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా హైదరాబాద్లో యూట్యూబ్లో విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న తరుణంలో ఈ లఘుచిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అందిస్తున్న సౌకర్యాలను ప్రత్యేకంగా పొందుపరుస్తూ తీసిన ఈ షార్ట్ ఫిలిం అందరి ప్రశంసలను అందుకుంటున్నది. ఉచిత విద్య అనేది హక్కు.. అది పొందడం సామాజిక బాధ్యత అని ఇలాంటి సామాజిక విలువలతో చిత్రాన్ని రూపొందించిన రామకృష్ణను మంత్రి అభినందించారు.
సర్కారు బడి ఔన్నత్యాన్ని, విలువను పేద విద్యార్థులకు చేస్తున్న మేలును పది మందికి తెలిసేలా రూపొందిన ‘నేను నా బడి.. మా అమ్మనాన్న’ లఘుచిత్రం ఆలోచింపజేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు.. ప్రైవేట్ స్కూళ్ల వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో సర్కారు పాఠశాలలు పేదింటి విద్యార్థులకు చేస్తున్న మేలును వివరిస్తూ శాయంపేటకు చెందిన గాజుల రామకృష్ణ దీనిని తెరకెక్కించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చదువుకునేందుకు అష్టకష్టాలు పడిన ఓ పేద, దివ్యాంగ విద్యార్థిని.. మూతపడే సర్కారు బడిని తెరిపించే కథాచిత్రం అందరినీ ఆకట్టుకోగా, నాలుగు ఉత్తమ వార్డులనూ సొంతం చేసుకుంది.
హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన రామకృష్ణది చేనేత కుటుం బం. సినిమాల్లో రాణించానే సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. బీవండిలో పదేళ్లపాటు పవర్లూమ్స్ నడుపుకుంటూ ఎన్నో కథలు రాశాడు. హైదరాబాద్లో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. పెద్దగా సంపాదన రాకపోయినప్పటికీ పలువురి సహకారంతో సమాజానికి ఉపయోగపడే లఘుచిత్రాలు రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో సెక్యూరిటీలో పనిచేస్తూనే షార్ట్ఫిలింలకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్, ప్రగతి పల్లె, రైతన్న.. వస్తున్నానన్నా, ఆడిషన్, నేను నా బడి.. మా అమ్మానాన్న, రాజకీయ నాయకుడు, పాండమిక్, ఒక పాట.. చిత్రీకరించినట్లు రామకృష్ణ చెప్పాడు. మరికొన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు.