తిరువనంతపురం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై మాదిరిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సైద్ధాంతిక మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కూడా చర్యలు చేపట్టాలని కేరళలో అధికారంలో ఉన్న సీపీఎంతోపాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాయి. మైనారిటీతోపాటు మెజారిటీ మతతత్వ సంస్థలు కూడా సమానంగా ప్రమాదకరమైనవని సీపీఎం ఆరోపించింది. కేవలం ఎంపిక చేసిన వాటిని నిషేధించడం వల్ల ఎలాంటి మేలు జరగదని బధవారం ఒక ప్రకనటలో పేర్కొంది.
‘అన్ని రకాల మతతత్వాలు ప్రమాదకరమైనవి. ఒక సంస్థను నిషేధించడం వల్ల దాని భావజాలం అంతం కాదు. వారు కొత్త పేరు లేదా గుర్తింపుతో తిరిగి వస్తారు. మతపరమైన అన్ని సంస్థలను నిషేధించాలన్న తర్కం ప్రకారం మీరు వ్యవహరిస్తే, ఆర్ఎస్ఎస్ మొదట ఉంటుంది. దానిని కూడా నిషేధిస్తారా?’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ప్రశ్నించారు. సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో ఆర్ఎస్ఎస్ సమానంగా బాధ్యత వహిస్తుందని విమర్శించారు. దేశంలో జరిగిన అనేక హింసాత్మక సంఘటనల వెనుక ఆ సంస్థ ఉందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించాలని కేరళకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బుధవారం డిమాండ్ చేశారు.
మరోవైపు కేరళలోని అధికారంలో ఉన్న సీపీఎంపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ మండిపడ్డారు. పతనంతిట్ట, కొట్టాయం జిల్లాల్లో అనేక మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పీఎఫ్ఐ, సీపీఎం కలిసి అధికారాన్ని పంచుకున్నాయన్న సంగతి తెలిసిందేనని ఆయన అన్నారు. కేరళలో సీపీఎం మద్దతులోనే పీఎఫ్ఐ వృద్ధి చెందిందని విమర్శించారు. ఉత్తర కేరళలో పలువురు పీఎఫ్ఐ నేతలకు సీపీఎంతో సంబంధాలున్నాయని ఆరోపించారు.
ఇండియన్ నేషనల్ లీగ్ (ఐఎన్ఎల్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఓడరేవు మంత్రి అహమద్ దేవర్కోయిల్కు నిషేధిత రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్)తో సన్నిహిత సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయని కే సురేంద్రన్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నుంచి తొలగించేలా ముఖ్యమంత్రి పినరయి విజయన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.