ఇంటింటికీ కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు
ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్ రాణి
రామాయంపేట, డిసెంబర్ 28 : కొవిడ్ టీకాపై ఎలాం టి నిర్లక్ష్యం చేయొద్దని కచ్చితంగా ప్రతిఒక్కరూ టీకాలు తీసుకోవాల్సిందేనని డీ.ధర్మారం వైద్యురాలు ఎలిజబెత్రాణి అన్నారు. మంగళవారం పీహెచ్సీ పరిధిలోని శివాయపల్లి, సుతారిపల్లి, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ టీకాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. రెండు మండలాల పరిధిలోని వైద్య సిబ్బంది ఇంటింటికీ, వ్యవసాయ బావులు, పంట చేలల్లో పని చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి టీకాలు వేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ట్రాక్టర్, ఆటో డ్రైవర్లకు కూడా ఎక్కడికక్కడా టీకాలు వేస్తున్నామన్నారు. వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించి టీకాలు తీసుకోవాలని సూచించారు.
కరోనా కట్టడికి చర్యలు..
నిజాంపేట, డిసెంబర్ 28 : కరోనాను కట్టడి చేయాలంటే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం నిజాంపేటలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి టీకా వేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం బాలమణి మాట్లాడుతూ కరోనా టీకాపై నిర్లక్ష్యం తగదని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, అనిత, బాలమణి పాల్గొన్నారు.
ఘన్పూర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్..
తూప్రాన్ రూరల్, డిసెంబర్ 28 : మండలంలోని ఘన్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నవారికి మంగళవారం సెకండ్ డోస్ టీకా వేశారు. వారం రోజులోపు మండలంలోని అన్ని గ్రామాల్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ నిర్వాహుకులు పావని, లక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.