న్యూఢిల్లీ : కరోనా రెండోదశ నుంచి దేశం ఇంకా బయటపడలేదు.. ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో థర్డ్ వేవ్పై నిపుణులు కీలక సమాచారం అందించారు. ఆగస్ట్లోనే థర్డ్ వేవ్ ప్రారంభమై.. అక్టోబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ పేర్కొంది. హైదరాబాద్, కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్లు మతుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని పరిశోధనా బృందం కరోనా కేసుల పెరుగుదల థర్డ్ వేవ్కు దారి తీస్తుందని తెలిపింది. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్రతో పాటు అధిక కొవిడ్ కేసులున్న రాష్ట్రాలను చూస్తే తెలుస్తోందని ప్రొఫెసర్ విద్యాసాగర్ బ్లూమ్బర్గ్కు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.
మేథమేటికల్ మోడల్ ప్రకారం.. థర్డ్ వేవ్పై అంచనా వేశారు. భారత్లో మొదటి వేవ్? రెండో వేవ్ ఏ స్థాయిలో వచ్చింది? ఆ రెండింటి మధ్య ఎంత సమయం? ఇలా పలు కోణాలపై అధ్యయనం చేసి థర్డ్ వేవ్పై అంచనాలు రూపొందించారు. మొదటి వేవ్ తర్వాత అక్టోబర్, నవంబర్ మధ్య కొవిడ్ నియమాలు పాటించకపోవడంతో ఈ ఏడాది మేలో భారీగా కేసులు పెరిగాయి. ప్రతి రోజు వేల మంది ప్రాణాలను బలిగొనగా.. మే 7న దేశంలో సెకండ్ వేవ్లో అత్యధికంగా 4,14,188 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత మహమ్మారి కాస్త శాంతించింది. అయితే, మేథమేటికల్ మోడల్ మేరకు.. దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, హాట్స్పాట్లలో ట్రాకింగ్ పద్ధతులు అమలు చేయాలని, కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశం ఉన్నందున జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా పది రాష్ట్రాలు రోజువారీ కొత్త కొవిడ్ కేసుల పెరుగుదల (టెస్ట్ పాజిటివిటీ రేటు-టీపీఆర్)ను నమోదు చేస్తున్నాయని ఇటీవల కేంద్రం తెలిపింది. పది శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది. రద్దీని నివారించాలని, నిబంధనలు పాటించేలా చూడాలని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పది రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ ఉన్నాయి. భారత్లో సెకండ్ వేవ్కు డెల్టా వేరియంట్ కారణమని పేర్కొంటున్న నిపుణులు.. థర్డ్ వేవ్కు కూడా అదే వేరియంట్ కారణమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 132 దేశాలకు డెల్టా వేరియంట్ విస్తరించగా.. అమెరికా, జపాన్, మలేషియాతో పాటు పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది.