నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 3: తెల్లబంగారం ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ఎగబాకుతూ అన్నదాతకు సిరులు కురిపిస్తున్నాయి. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా అడ్తీదారులు కొనుగోలుకు ఎగబడుతుండటంతో మద్దతుకు రెట్టింపు రేటు దక్కుతున్నది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ రూ.9,550 పలికింది. మధ్యస్థ ధర రూ.9 వేలు, కనిష్ఠ ధర రూ.7,500 వచ్చింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్కు రూ.9,500 లభించింది. ఇక్కడ మోడల్ ధర రూ.9 వేలు కాగా, కనిష్ఠ ధర రూ.8300 పలికింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రూ.9,361 ధర దక్కింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో క్వింటాల్కి రూ.9,501 వచ్చింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సీజన్లోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.9310 పలికింది. కొత్త సంవత్సరంలో అంచనాలకు మించి పత్తికి మంచి ధరలు లభిస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.