ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మార్కెట్కు తీసుకవచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్(ఈ నామ్)లో గరిష్ట ధర క్వింటాల్ రూ 7,700 పలుకగా, మధ్య ధర రూ 7,200, కనిష్ట ధర రూ 5వేలు పలికింది.
గత కొద్ది రోజుల నుంచి మార్కెట్కు వానాకాలం సాగు చేసిన పంటను రైతులు తీసుకువస్తున్నారు. గత సంవత్సరం భారత పత్తి సంస్థ(సీసీఐ) క్వింటాల్ మద్దతు ధర రూ 5,725 చొప్పున ఖరార్ చేసి కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం సీసీఐ మద్దతు ధర రూ 6,025 నిర్ణయించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
దీంతో పంట ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉన్నందున సదరు వ్యాపారులు మొదటి నుంచే పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఏదేమైన గత 15 రోజుల నుంచి అంచెలంచెలుగా తెల్లబంగారానికి రెక్కలు వస్తూ ఏకంగా రాష్టంలోనే తొలిసారిగి రికార్డు స్థాయి ధర పలకడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. దీంతో ఈ సంవత్సరం పొరుగు జిల్లాల రైతులు ఖమ్మం మార్కెట్కు బారీగా పంటను తీసువచ్చే అవకాశం ఉంది.