ఐదెకరాల్లో పండ్లు, కూరగాయల సాగు
డ్రిప్తో తక్కువ నీటి వినియోగం..
కోళ్లు, గొర్రెలు, పశువుల పెంపకం
చేపల చెరువులో ఏడు వేల కొర్రమీనులు
సమీకృత వ్యవసాయంతో ఓ రైతు విజయం సాధించాడు.. మేలైన పద్ధతుల్లో వివిధ పండ్లు, కూరగాయలు పండిస్తున్నాడు. ఐదెకరాల్లో ఒకే చోట సాగు చేయడం.. కోళ్లు, గొర్రెలు, చేపలు, పశువులను పెంచడం చేస్తున్న గజ్వేల్ పట్టణానికి చెందిన గుంటుక రాజు సక్సెస్ స్టోరీ
గజ్వేల్ రూరల్, డిసెంబర్ 28: భూసారానికి హాని కలుగకుండా మేలైన పద్ధతుల్లో వివిధ పండ్లు, కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు ఓ రైతు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు సాధించాలనే లక్ష్యంతో ఐదెకరాల విస్తీర్ణంలో జామ, మామిడి, సపోటా, బొప్పాయి మొక్కలు నాటాడు. రెండేండ్ల క్రితం నాటిన జామ ఈ యేడు కాత తీశాడు. మొదట్లో కొద్దిగానే దిగుబడి వచ్చినప్పటికీ రెండో పంట కోసం మళ్లీ మొక్కలను సిద్ధం చేస్తున్నాడు.
గజ్వేల్ పట్టణానికి చెందిన గుంటుక రాజు మండల పరిధిలోని బయ్యారంలోని తన ఐదెకరాల వ్యవసాయ పొలంలో ఆంధ్రా ప్రాంతం నుంచి తీసుకొచ్చిన రెండు వేల జామ మొక్కలు, సపోటా, బొప్పాయి, ఐదు వందల మామిడి మొక్కలను నాటాడు. కొద్ది రోజుల క్రితమే జామ పంటను విక్రయించాడు. కాయలు నాణ్యతగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర పలికింది. మరో రెండు నెలల్లోనే రెండోసారి కోత చేయనున్నాడు. సపోటా, బొప్పాయి, మామిడి అన్నీ కలిసి ఐదు వందల మొక్కలు నాటగా అందులో బొప్పాయి చెట్లు కోతకొచ్చాయి. వీటన్నింటికీ డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాడు. పదిహేను రోజుల నుంచి మరో రెండెకరాల విస్తీర్ణంలో డ్రిప్ ద్వారా టమటా సాగు చేస్తున్నాడు.
కోళ్లు, గొర్రెలు, చేపలు, పశువుల పెంపకం…
వ్యవసాయ పొలం వద్దనే పదుల సంఖ్యలో కోళ్లు, ముప్పైకి పైగా గొర్రె పిల్లలు, పశువులను పెంచుతున్నాడు. వీటిని పెంచడం ఎంతో ఇష్టంగా, చాలా సంతృప్తిగా ఉందంటున్నాడు. పొలం వద్దనే ఆరు వందల గజాల విస్తీర్ణంలో చేపల చెరువును ఏర్పాటు చేసి అందులో ఏడు వేల కొర్రమీను పిల్లలను నాలుగు నెలల క్రితం వేయగా, ప్రస్తుతం రెండొందల గ్రాముల వరకు బరువు పెరిగాయి. మరో నాలుగు నెలల తరువాత చేపలు కిలోకు పైగా బరువు వస్తాయి. అయితే, గజ్వేల్ ప్రాంతంలో చేపల చెరువును నిర్మించి చేప పిల్లలను వేయడం ఇదే ప్రథమమని చెప్పవచ్చు.
పండ్ల తోటల సాగుతో సంతృప్తిగా ఉంది
అన్ని రకాల పండ్ల మొక్కలను ఒకే చోట సాగు చేయడం, కోళ్లు, గొర్రెలు, చేపలు, పశువులను పెంచడం ఎంతో సంతృప్తిగా ఉంది. నేను అనుకున్న విధంగా పండ్ల తోటను సాగు చేస్తున్న. సీఎం కేసీఆర్ అరుతడి పంటల సాగు కోసం చేస్తున్న ప్రయత్నం ఎంతో బాగుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయల సాగుతో మంచి లాభాలు వస్తాయి. – గుంటుక రాజు