హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 27,524 క్యూసెక్యుల నీరు వస్తున్నది. అదేవిధంగా 25,427 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 823.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. అదేవిధంగా ప్రాజెక్టులో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చు. అయితే ప్రస్తుతం 43.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.