‘చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే పరకాల నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది.. ఆయన ఎంతో ఉత్తముడు.. ప్రజలు భారీ మెజార్టీతో చల్లాను దీవించాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. చల్లా ఎప్పుడూ పరకాల నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే తనవద్దకు వస్తారని, వ్యక్తిగతంగా ఏమీ అడగరని వివరించారు. ఆయన గెలిస్తే రైతుబంధు రూ.16వేలు అవుతుందని, 24గంటల కరెంటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతును తెచ్చుకుంటారా?’ ఆలోచించాలె అంటూ ప్రజలకు సూచించారు.
వరంగల్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరకాల ప్రజలను కోరారు. శుక్రవారం పరకాల శివారులో జరిగిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే పరకాల నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు ఎకరాకు రూ.10 వేలు ఉన్న రైతు బంధు ఆ తర్వాత రూ.16 వేలకు పెరుగుందని చెప్పారు. చల్లా ధర్మారెడ్డి గెలిస్తేనే 24 గంటల కరెంటు కొనసాగుతుందన్నారు. చల్లా దర్మారెడ్డి ఉత్తమమైన మనిషి అని కితాబునిచ్చారు. ధర్మారెడ్డి తన వద్దకు ఎప్పుడు వచ్చినా పరకాల నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే వస్తారని, వ్యక్తిగత పనులు ఏమీ అడగరని పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో సాగునీటికి అవసరమైన దేవాదుల, చలివాగు, ఎస్సారెస్పీ పనులు పూర్తి చేయాలని కోరుతారని చెప్పారు. పరకాలను అన్నివిధాలా మరింత అభివృద్ధి చేసుకుందామని, ఈ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ‘పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మంచి మనిషి. మీకు మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్ల మార్పు కోరుకునుడు ఎందుకు?. ఎవరైనా పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతును తెచ్చుకుంటరా? మంచిగ పని చేస్తున్న ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పరకాల అభివృద్ధి ఇంత కంటే వేగంగా జరుగుతుంది.
పరకాల అభివృద్ధి బాధ్యత నాది’ అని స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు చేసిన నిర్వాకాలతో ఉపాధి కోసం పరకాల ప్రజలు భీవండికి వలస పోయారని, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని గుర్తుచేశారు. దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నామని, త్వరలోనే దీన్ని ప్రారంభించుకుంటామని చెప్పారు. పరకాలలోని న్యాయవాదులు సూచించినట్లుగా ఇక్కడ కోర్టు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్తో సంప్రదించి పరకాలలో కోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను తెలుసుకుంటామన్నారు. కోర్టు ఏర్పాటు కోసం ఏది ఉత్తమైన మార్గమో దాన్ని అనుసరించి పూర్తి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమని, ఎన్నికల్లో ప్రజలే గెలవాలన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కష్టపడి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు ఎవరి చేతిలోనో పెడితే రాష్ట్రం మళ్లీ వెనక్కి పోతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నామన్నారు. సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలంటే ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే పదేండ్ల కష్టం బూడిద పాలవుతుందని చెప్పారు.