క్వీన్స్టౌన్: స్టార్ ప్లేయర్లంతా కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో భారత మహిళల జట్టు ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి నాలుగు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన మిథాలీరాజ్ బృందం.. గురువారం జరిగిన నామమాత్రపు పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అమేలియా కెర్ (66) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాజేశ్వరి, దీప్తి, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. స్మృతి మందన (71), హర్మన్ప్రీత్ కౌర్ (63), మిథాలీ రాజ్ (54 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. స్మృతి మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, అమేలియా కెర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. వచ్చే నెలలో కివీస్ వేదికగానే వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. మెగా టోర్నీకి ముందు హర్మన్ప్రీత్ కౌర్ ఫామ్ అందుకోవడం టీమ్ఇండియాకు శుభపరిణామం అని స్టార్ ఓపెనర్ స్మృతి మందన పేర్కొంది.