కీవ్/న్యూఢిల్లీ/పారిస్: తూర్పు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంలో భాగంగా కార్యాచరణ రూపొందించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. ఇరువురి మధ్య ఆదివారం 105 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ సాగింది. ఉక్రెయిన్ ప్రభుత్వ బలగాలు, రష్యా మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో కలిసి త్రైపాక్షిక చర్చలు జరుపాలని అధినేతలు నిర్ణయించారు.
ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్.. పుతిన్తో భేటీకానున్నట్టు సమాచారం. మరోవైపు, మాక్రన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఆదివారం ఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ చేయడంలో భాగంగా రష్యాతో చర్చలు జరుపాలని ఆయన్ని కోరారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితులను దౌత్యపరంగా చర్చించుకొని పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్స్కీ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే.
ఇందుకు సమావేశ వేదికను ఎంపిక చేయాలని ఆయన పుతిన్కు విజ్ఞప్తి చేశారు. అయితే జెలెన్స్కీ భేటీ ప్రతిపాదనపై రష్యా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శనివారం వందల సంఖ్యలో ఫిరంగుల వర్షంతో పాటు రష్యా చేపట్టిన న్యూక్లియర్ డ్రిల్తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, పొలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి.
వెంటనే వెళ్లిపోండి
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం మరోసారి సూచనలు చేసింది. తాత్కాలికంగా దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని పేర్కొన్నది. దౌత్యకార్యాలయంలోని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర విదేశాంగ సూచించింది.