న్యూఢిల్లీ: ఫిరోజ్పూర్లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ప్రజలు ఎవ్వరూ రాలేదని, దానిని కప్పిపుచ్చుకోవడానికి భద్రతాలోపం సాకుగా చూపి ప్రధాని పర్యటనను రద్దు చేసుకొన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా విమర్శించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతాలోపం లేదని స్పష్టంచేశారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట రాజకీయ పర్యటనలు చేయటం ప్రధానికి అలవాటుగా మారిందని విమర్శించారు. భద్రతా వైఫల్యమంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనవసరంగా సహనం కోల్పోవద్దని హితవు పలికిన సుర్జేవాలా.. ప్రధాని పర్యటన రద్దుకు సంబంధించి ట్విట్టర్లో కీలక విషయాలను వెల్లడించారు.
మాకు తెలియదు: రైతులు
ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్న విషయం తమకు తెలియదని రోడ్డును దిగ్బంధించిన రైతులు వెల్లడించారు. ‘ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్నట్టు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు మాకు చెప్పారు. సభా వేదిక వద్ద పెద్ద హెలిప్యాడ్ ఉన్నది. దీంతో పోలీసులు అబద్ధం చెబుతున్నారని, మోదీ వాయుమార్గంలోనే వస్తున్నారని భావించాం. అందుకే మేం నిరసన చేపడుతున్న రోడ్డును ఖాళీ చేయలేదు. ఆయన రోడ్డు మార్గంలోనే వస్తున్నారని మమ్మల్ని కన్విన్స్ చేసి ఉంటే మేం ఖాళీ చేసేవాళ్లం’ అని రైతులు వివరించారు.
అంతా డ్రామా!
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి ఎదురైన అనుభవం గతంలోనూ పలువురు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులకు ఎదురయ్యాయి. కానీ వారెవ్వరూ మోదీ మాదిరి వెనక్కి తిరిగి వెళ్లిపోయిన ఉదంతాలు చోటుచేసుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా రెండు ఉదంతాలను వారు ఉటంకిస్తున్నారు. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్రెడ్డి ఉన్నారు. సీఎం రేసులో ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డికి కాకుండా కోట్లకు ఆ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని పీవీ కడపలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి వచ్చారు. వైఎస్ అనుచరులు బహిరంగసభ వేదికపైకి చెప్పులు విసిరారు. నిరసనకారుల చర్యను పీవీ లైట్గా తీసుకొని, తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన సమక్షంలో ప్రధానికి ఇబ్బంది కలిగినందుకు కోట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను ప్రధానికి ఇవ్వాలని వ్యక్తిగత కార్యదర్శికి ఇచ్చేసి వెళ్లారు. ఆ మరసటి రోజే హైదరాబాద్లో పార్టీ కార్యక్రమానికి పీవీ హాజరయ్యారు. తన లేఖపై పీవీ స్పందించకపోవటంతో కోట్ల ముభావంగా ఉన్నారు. అది గమనించిన పీవీ తన ప్రసంగంలో ‘రాజకీయాల్లో అవమానాలు మామూలే. ఎదుర్కొని నిలబడటమే నాయకుడి లక్షణం’ అన్నారు. మరో సందర్భంలో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్కు వచ్చారు. ఓల్డ్ సిటీలో జరిగే కార్యక్రమానికి వెళ్లే మార్గంలో చాదర్ఘాట్ వంతెనపై ట్రాఫిక్ జామ్ అయింది. ఆయన వంతెన దాటే వరకు కాలినడకన వెళ్లారు తప్ప భద్రతా వైఫల్యం అని వెనక్కి తిరిగివెళ్లలేదు. వీటిని గుర్తు చేస్తూ.. మోదీ మాత్రం డ్రామా చేయడానికే ఇలా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఖాళీ కుర్చీల వల్లే
మోదీ పర్యటనపై నెటిజన్ల సెటైర్లు