హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీ అన్నారు. దేశంలోనే టీఆర్ఎస్ లాంటి పార్టీ లేదన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్తకు సొంతంగా బీమా చేసి, ఏ కారణం చేత అయినా కార్యకర్త మరణిస్తే రెండు లక్షల రూపాయల బీమా అందచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత గౌరవం గుర్తింపు లభిస్తుందన్నారు. అందరు కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దేవరుప్పుల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, జెడ్పీటీసీ పల్లా భార్గవి, తదితరులు ఉన్నారు.