బెంగళూర్ : మూడున్నరేండ్ల పాలనలో బీజేపీ కర్నాటక (Karnataka Assembly elections) నుంచి ఏకంగా రూ. 1.5 లక్షల కోట్లను లూటీ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
బీజేపీ దోచుకున్న సొమ్ముతో రాష్ట్రంలో 100 ఎయిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయవచ్చని, 30,000 స్మార్ట్ క్లాస్రూంలు, 30 లక్షల మంది పేదలకు ఇండ్లు నిర్మించవచ్చని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశం గురించీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని, వారు రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తారని, కర్నాటక అభివృద్ధికి ఏ మాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తారని మండిపడ్డారు.
దేశంలో పలు రకాల దొంగలు ఉన్నారని, కొందరు ఇండ్లలో వస్తువులను దొంగిలిస్తే కొందరు ఏకంగా ప్రభుత్వాలను దొంగిలించే వారు కూడా బయలుదేరారని బీజేపీపై విరుచుకుపడ్డారు. వారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అలాంటి దొంగల పనిపట్టాలని ఆమె పిలుపు ఇచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Body Guard | జీతం ఇవ్వలేదని.. మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్