జగిత్యాల : ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod kumar) ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం,ఉన్నతాధికారులతో చర్చించి ఆరు గ్యారెంటీల అమలుకు జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barage) కు పగుళ్లు వచ్చాయనే సాకుతో ఈ యాసంగి సీజన్ లో గోదావరి నీళ్లను ఇతర ప్రాజెక్టులోకి మళ్లీంచకపోవడంతో రైతులు పంటల సాగును తగ్గించారని, దీంతో పొలాలకు సాగునీళ్లు అందక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. మరో నాలుగు మాసాల్లో వర్షాకాలంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున మేడిగడ్డ బ్యారేజ్ ను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు.
ఓటమి భయంతోనే బండి సంజయ్ అడ్డగోలు మాటలు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఎంపీ బండి సంజయ్ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్కు ఓటమి కొత్త కాదని, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను గడ్డిపోచల్లేక్క వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు రూపాయలు తీసుకురాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మేడ లక్ష్మీ నర్సింహరావు, సీనియర్ నాయకుడు బాపురెడ్డి, జడ్పీటీసీ భూమయ్య, ఎంపీపీ రేవతి తదితరులు పాల్గొన్నారు.