హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా…పాలనకు దిక్సూచిలా టీఆర్ఎస్ దేశంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించే ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రవచించిన బోధించు.. సమీకరించు.. పోరాడు అనే నినాద స్ఫూర్తితో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను మలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 20 ఏండ్ల క్రితం ఆవిర్భవించిన ఉద్యమ సంస్థ టీఆర్ఎస్ 14 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో రాష్ర్టాన్ని సాధించిందని చెప్పారు. ఏడేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను అబ్బురపడే రీతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అనేక ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని శాంతియుత మార్గంలో సాధించినట్టు పేర్కొన్నారు. అహింసాయుత పద్ధతిలో, ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ప్రజాస్వామ్య విలువలకే ఆదర్శంగా టీఆర్ఎస్ నిలిచిందని చెప్పారు. రాష్ట్ర సాధన అనంతరం టీఆర్ఎస్ పార్టీ దేశానికే దిక్సూచిలా అనేక కార్యక్రమాలను రూపొందించటం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఇక్కడి పాలనను అనేక రాష్ట్రాల వారు ప్రశంసిస్తున్నారని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కావాలని, లేదంటే ఆ రాష్ట్రంలో తమను కలుపాలని కోరుకునేస్థాయికి ఎదగడమన్నది తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.
సోమవారం హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ఫ్లీనరీకి ఎంపికచేసిన ప్రతినిధులే రావాలని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రతినిధులందరూ గులాబీ డ్రెస్కోడ్ను పాటించాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్లీనరీ ప్రాంగణంలో 6,500 మందికి, ప్రాంగణానికి బయట ప్రతినిధులతో వచ్చే దాదాపు 4వేల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్లీనరీ కమిటీల బాధ్యులు తక్కువ సమయంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్లీనరీ ప్రాంగణానికి ప్రతినిధులంతా సోమవారం ఉదయం 10 గంటకల్లా చేరుకోవాలని కోరారు. 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, అనంతరం 7 తీర్మానాలు, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయ తీర్మానాలుంటాయని వెల్లడించారు. హాజరయ్యే ప్రతినిధులు తమ పేర్ల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. హైటెక్స్కు ఇరువైపులా 50 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యమ్రంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంపై మంత్రి కేటీఆర్ సీరియస్గా స్పందించారు. ఎన్నికల కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని మండిపడ్డారు. కొనసాగుతున్న ప్రభుత్వ పథకాన్ని ఈసీ ఎట్లా ఆపుతుందని ప్రశ్నించారు. వాసాలమర్రిలో ప్రారంభమై, పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో కొనసాగుతున్నదని, వేలాదిమంది అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు. రూ. లక్షా 70 వేల కోట్ల పథకాన్ని హుజూరాబాద్ కోసమే ఎలా తెస్తామని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితబంధు పథకాన్ని తెస్తామా అని నిలదీశారు. ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే ఉండాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఈసీ ఈసారి సరిహద్దు జిల్లాకు విస్తరించిందని, రాబోయే రోజుల్లో సరిహద్దు రాష్ర్టాలకు విస్తరిస్తుందేమోనని అనుమానం వ్యక్తంచేశారు.
సోమవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరి సందర్భంగా టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ రూపొందించిన పాటల సీడీని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు. శనివారం తెలంగాణభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి, కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ రచించారు.
హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ ఉభయ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఈటల రాజేందర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైనా, కుట్రలు, చీకటి ఒప్పందాలు చేసుకొన్నా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి టీఆర్ఎస్ గెలుపును నిలువరించాలని చేసిన కుట్రలకు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని సమయం వచ్చినప్పుడు బయటపెడుతామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకొని పోటీచేశాయని వివరించారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థికి ఓటువేయాలని కరపత్రం విడుదల చేయడంలోని ఆంతర్యం అదేనని తెలిపారు. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు. ఆరెస్సెస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తున్నదని, ఇటీవల పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. గాంధీభవన్లో గాడ్సె దూరాడని పునరుద్ఘాటించారు.