ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం ఎన్ బిరెన్ సింగ్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మణిపూర్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే దేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) దుకాణాలను తెరుస్తామని సీఎం ఇచ్చిన హామీపై కాంగ్రెస్ మండిపడింది.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం 48 గంటల్లో ముగుస్తుండగా బీజేపీ సీఎం మద్యం దుకాణాలను తెరుస్తామని ప్రకటించడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విస్మయం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన మణిపూర్ మహిళలకు అవమానకరమని ఆయన అభివర్ణించారు. సీఎం తక్షణమే తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అజ్ఞాత రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 1991, జనవరి 1 నుంచి మణిపూర్లోని అన్ని ఐఎంఎఫ్ఎల్ దుకాణాలను బలవంతంగా మూసివేసినప్పటి నుంచి రెండు దశాబ్ధాలకు పైగా రాష్ట్రంలో మద్యం లభించడం లేదు. ఆపై మణిపూర్ మద్య నిషేధ చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్రాన్ని డ్రై స్టేట్గా ప్రకటించారు. రాష్ట్రంలోని పర్వత ప్రాంతంలో నివసించే ఎస్సీ, ఎస్టీలను దేశీ మద్యం తయారీకి మద్యనిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.