PM Modi : ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాం (Assam) లో పర్యటించారు. దరంగ్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పై తీవ్ర విమర్శలు చేశారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు ఇప్పటికీ మానిపోలేదని అన్నారు. ఈ తరం కాంగ్రెస్ ఆ గాయాలపై ఉప్పు చల్లుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత్పై వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో జట్టు కట్టిందని ప్రధాని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇది బయటపడిందన్నారు. పాకిస్థాన్లోని ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టిందని, కానీ హస్తం పార్టీ మన సైన్యానికి కాకుండా దాయాది దేశంలోని సైన్యానికి మద్దతిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్ అబద్ధాలు కాంగ్రెస్ అజెండాలుగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ రక్షణ కవచంగా మారిందని, వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
గాయకుడు భూపేన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయమా కాదా..? అని ప్రశ్నించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. దీనికిముందు దరంగ్ జిల్లాలోని మంగల్డోయ్లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణంతోపాటు నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎమ్ పాఠశాలను ప్రారంభించారు.