Viral Video | ఇటీవల ఢిల్లీలోని ఓ కారు షోరూం మొదటి అంతస్తు నుంచి మహీంద్రా థార్ వాహనం కింద పడిపోయిన ఘటనపై యువతి మాని పవార్ స్పందించింది. తాను చనిపోయానని వస్తున్న వదంతులను ఖండించింది. తాను బతికే ఉన్నానని, ఈ ప్రమాదంలో ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదని ఆమె స్పష్టం చేశారు. లైకులు, వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘజియాబాద్కు చెందిన మాని పవార్ (29) ఇటీవల తన కుటుంబంతో కలిసి తూర్పు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లో ఉన్న ఓ షోరూంకు కొత్త మహీంద్రా థార్ కారు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. వాహనాన్ని బయటకు తీసే ముందు షోరూంలోనే సంప్రదాయబద్ధంగా పూజ చేసింది. టైర్ కింద నిమ్మకాయ పెట్టే సమయంలో ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా యాక్సిలరేటర్ను గట్టిగా నొక్కారు. దీంతో దాదాపు రూ.27 లక్షల విలువైన ఆ వాహనం అదుపుతప్పి షోరూం అద్దాలను పగలగొట్టుతూ మొదటి అంతస్తు నుంచి కింద రోడ్డుపై పడి తలకిందులుగా పడిపోయింది.
ఈ ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో అనేక వదంతులు వైరల్ అయ్యాయి. ఆమె ముక్కు విరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని.. చివరకు చనిపోయిందన్న వార్తలు కొన్ని వీడియోల రూపంలో ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో మాని పవార్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ నకిలీ వార్తలను ఖండించడానికే ఈ వీడియో చేస్తున్నానని.. ప్రమాదం జరిగినప్పుడు కారులో నాతో పాటు నా కుటుంబ సభ్యులు, ఓ సేల్స్మ్యాన్ ఉన్నారని చెప్పింది. కారు కింద పడగానే మేమంతా ముందు డోర్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చామని.. మాలో ఎవరికీ కనీసం చిన్న గాయం కూడా కాలేదని వివరించారు. కారు అప్పటికే హై ఆర్పీఎంలో ఉందని సేల్స్మ్యాన్ మమ్మల్ని హెచ్చరించారని.. తాను పొరపాటున యాక్సిలరేటర్ నొక్కగానే అది ఒక్కసారిగా దూసుకెళ్లి కిందపడిపోయిందని చెప్పింది. తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని.. ఫేక్ వీడియోలు ప్రచారం చేయడం ఆపండండి అంటూ చెప్పింది.