IndiGo Flight : లక్నో (Lucknow) నుంచి ఢిల్లీ (Delhi) కి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో రన్వేపై టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తింది. దాంతో వెంటనే స్పందించిన పైలట్ చివరి నిమిషంలో టేకాఫ్ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ (SP MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
విమానం ఆగిపోవడంతో ప్రయాణికులను వేరే విమానంలో ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇటీవల తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో కూడా ఇలాగే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర పరిస్థితుల్లో చెన్నై విమానాశ్రయంలో దించారు. ఆ సమయంలో విమానంలోని 150 మంది ప్రయాణికుల్లో పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్ సురేష్, ఆదూర్ ప్రకాశ్, కె రాధాకృష్ణన్ తదితరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.