హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షలపై విద్యార్థుల్లో ఆయోమయ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 23 నుంచే ప్రారంభం కావలసిన మెయిన్-1 పరీక్షలకు ఇంకా అడ్మిట్కార్డులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా ఏటా ఈ పరీక్షలకు కనీసం 10 రోజుల ముందుగానే అడ్మిట్కార్డులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు గురువారం నుంచే ప్రారంభం కావలసిన ఈ పరీక్షలకు ఆదివారం రాత్రి దాకా అడ్మిట్కార్డులు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థులు జేఈఈ మెయిన్-1 పరీక్ష రాయాల్సిన నగరాల వివరాలను ఈ నెల 14నే అందుబాటులో ఉంచిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వర్గాలు.. అడ్మిట్కార్డు లేనిదే పరీక్షకు అనుమతించబోమని తేల్చిచెప్తున్నారు. దీంతో ఎన్టీఏ నిరుపయోగమైన పనులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అది నుంచీ వివాదాస్పదమే
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల్లో జేఈఈ మెయిన్స్ ప్రధానమైనది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పదేపదే విఫలమవుతున్నది. దీనిపై ఎన్ని విమర్శలు వ్యక్తమైనా ఎన్టీఏ తన వైఫల్యాలను అధిగమించేందుకు ప్రయత్నించడంలేదు. మొండిగా పాత విధానాలనే కొనసాగిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో ఘోరంగా చతికిలబడుతున్నది.