Pocharam Srinivas Reddy | ప్రజా సేవంటే పరితపిస్తారు ఆయన.. 74 ఏండ్ల వయస్సులోనూ యువకుడిలా పనిచేస్తున్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లూ తుడుస్తున్నారు. ప్రజాసేవలో తరిస్తూ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మహానాయకుడు. గ్రామం పేరునే ఇంటిపేరుగా ప్రాచుర్యం పొందారు. పంచెకట్టు, మెడలో కండువాతో అచ్చం రైతులా కనిపిస్తారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలు కోసం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ నోటితో లక్ష్మీపుత్రుడు అనిపించుకున్న నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి.
సభాపతికి శ్రీనివాసరెడ్డి అని తల్లిదండ్రులు నామకరణం చేశారు. కానీ లక్ష్మీపుత్రుడంటూ సీఎం కేసీఆర్ పేరుపెట్టారు. గులాబీ దళపతికి అత్యంత ప్రీతిపాత్రుడు. తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెండోసారి శాసనసభాపతి పదవిని చేపట్టారు. నీటి తీరువా పన్నుల రద్దు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలన్నీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి రావడం కారణంగా పోచారం కాస్త సీఎం దృష్టిలో లక్ష్మీపుత్రుడయ్యారు. రైతుబిడ్డగా రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిగా పోచారం శ్రీనివాసరెడ్డి పనితీరును చూసిన ముఖ్యమంత్రే ఈ పేరును పెట్టారు.
10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ..
సభాపతి శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదు. అది ఆయన గ్రామం పేరు. వీరి ఇంటి పేరు పరిగె. రాజకీయాల్లోకి రాకముందు పరిగె శ్రీనివాసరెడ్డిగా పిలువబడిన వ్యక్తి ఇప్పుడు ఊరు పేరునే ఇంటిపేరుతో పోచారం శ్రీనివాసరెడ్డిగా అందరికీ సుపరిచితమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్వరితోనూ సాధ్యం కాని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయించి, 10వేల ఇండ్లను కట్టించి పంపిణీ చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాసరెడ్డి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పీఏసీఎస్ చైర్మన్గా ప్రస్థానం…
పోచారం శ్రీనివాస రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తూనే చదువుకున్నారు. వ్యవసాయంపై అనుభవం ఉన్న ఆయన రైతు సమస్యలపై గళమెత్తారు. 1976లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఏడాది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో ఎన్టీ రామారావుపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. 1987లో ఎన్టీఆర్ ఆశీస్సులతో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పదవిని చేపట్టారు. తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2000లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణ రెండవ శాసనసభాపతిగా ప్రస్తుతం పని చేస్తున్నారు.