Koppula Eshwar | ప్రజాక్షేత్రమే ఆయన ఇల్లు. సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం.. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నాననే భరోసా.. కోపం దరిచేరని శాంతమూర్తి. నిరంతర శ్రామికుడు. సింగరేణి కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రభుత్వ చీఫ్ విప్గా.. రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ప్రజ్ఞాశాలి. ఉద్యమకారుడిగా, కార్మిక క్షేత్రంలో గులాబీ జెండాను రెపరెపలాడించారు. కేసీఆర్ వెన్నంటే ఉండి, అత్యంత నమ్మకస్తుడిగా రాష్ట్ర సాధనకు తనవంతు పాత్రను పోషించారు.. ఆయనే కొప్పుల ఈశ్వర్.
ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తన తల్లిదండ్రుల పేరిట ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యపరీక్షలు, చికిత్సలు చేయించారు. నిరుద్యోగ యువత కోసం జాబ్మేళా నిర్వహించి దాదాపు 2వేల మందికి ప్రైవేటుగా ఉద్యోగావకాశాలు కల్పించారు. పేదింటి యువతుల వివాహాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అందరూ ఆయనను ఆత్మీయంగా ఈశ్వరన్నా అని పిలుస్తారు.
ఈశ్వర్ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలంలోని కుమ్మరికుంట. 27ఏండ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో అనేక పదవులు నిర్వహించారు. ఉద్యమపార్టీలో చేరి.. 2004లో మేడారం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి వెనుదిరగకుండా మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి అప్రతిహత విజయాలను నమోదుచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు గెలిచి కొప్పుల రికార్డు సృష్టించారు. ఉద్యమ నేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, 2008 ఉపఎన్నికలో మేడారం నుంచి గెలిచి తన సత్తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో ధర్మపురి నియోజకవర్గానికి మారి అక్కడా గెలిచారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010లో ధర్మపురి నుంచి ఎన్నికయ్యారు. 2014లో ధర్మపురి నుంచి గెలిచి శానససభలో చీఫ్విప్గా సేవలందించారు. ఆ తర్వాత 2018లోను ఆరోసారి విజయదుందుభి మోగించి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కొప్పుల ఈశ్వర్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ‘మన ఊర్లో -మన ఎమ్మెల్యే’ పేరుతో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 50, 30 పడకల దవాఖానలను నిర్మించారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు. ధర్మపురి టెంపుల్ సిటీకి వంద కోట్లను విడుదల చేయించారు.ఈ ఐదేండ్లల్లో రూ.1500 కోట్లతో మౌలిక వసతులు చేపట్టారు.