సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : తార్నాకలోని ఆర్టీసీకి చెందిన హాస్పిటల్లో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శైలజామూర్తి అన్నారు.
గత ఏప్రిల్ నుంచి ఉ. 9 నుంచి మ. 2.30 గంటల వరకు ఆర్టీసీ సిబ్బందికి, సా. 4.30 నుంచి 6.30 గంటల వరకు సాధారణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి రూ.300 నుంచి 400 వరకు ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. కొన్ని వైద్య సేవల చార్జీలలో 40 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నామని చెప్పారు.