ఖలీల్వాడి, డిసెంబర్ 22: దేశంలోనే ఎక్కడాలేని పథకం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయాలను చూడకుండా ప్రజలకు పనికొచ్చేవే చేస్తారని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ సహృదయంతో రూపకల్పన చేసినవని వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సాయం చెక్కులను గురువారం ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అనేక కుటుంబాల్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే కష్టంతో కూడుకున్న పని అని, ఆడబిడ్డ పెండ్లి కోసం పైసాపైసా కూడబెట్టుకొనే కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటి కుటుంబాలకు చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లు, ఇంట్లో జరిగే శుభకార్యానికి ప్రభుత్వం తరఫున ఆశీర్వాదం కింద కేసీఆర్ ఈ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
ఆ ఘటనతోనే..కల్యాణలక్ష్మి, షాదీముబారక్
తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా సమీపంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి… తన ఇల్లు కాలిపోయిన ఘటనలో బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం కాలిబూడిదైందని చెప్పాడని గుర్తు చేశారు. వెంటనే స్పందించిన కేసీఆర్ అక్కడే ఉన్న వాళ్లంతా కలిసి తలాకొంత డబ్బులు సేకరించి రూ.50వేలను ఆ వ్యక్తికి ఇచ్చారని తెలిపారు. అప్పుడు చేసిన ఆలోచనే కల్యాణలక్ష్మి కార్యక్రమని చెప్పారు. మొదట రూ.50,116తో కల్యాణలక్ష్మిని ప్రారంభించగా, ప్రస్తుతం రూ.లక్షా116కు పెంచారన్నారు.
బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు..
హైదరాబాద్ తరహా కళాభారతి, మార్కెట్, వెజ్, నాన్వెజ్ మార్కెట్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో కళాభారతి, పాత ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయ స్థలాల వద్ద వెజ్, నాన్వెజ్ మార్కెట్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ను అద్భుతంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ముస్లిముల కోసం ఖిల్లా సమీపంలో మైనార్టీ మెటర్నిటీ దవాఖాన, హజ్ భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వివరించారు. ప్రజల మేలు కోసం అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ నాయకులు ధర్నాలు చేసి అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. గాయిగత్తర చేసినా ప్రజలు బీజేపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే బిగాల
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్నివర్గాల వారు సంతోషంగా ఉండడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
నగరంలో 9వేల కొత్త పింఛన్లు మంజూరు చేశామని వివరించారు. మొత్తం 305 మంది లబ్ధిదారులకు రూ.లక్షా116 చొప్పున రూ.3,05,35,380 అందజేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఎస్డబ్ల్యూడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, కార్పొరేటర్లు , అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన..
జిల్లా కేంద్రంలోని సారంగాపూర్ వద్ద ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఎమ్మెల్సీ కవిత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించారు. అనంతరం టీఈఎమ్ఆర్ఐఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఖిల్లా సమీపంలో మినీ హజ్, మైనార్టీ మెటర్నిటీ దవాఖాన నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.