అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొందరు నాయకులను గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వం అశాస్త్రీయ పీఆర్సీ ప్రకటనపై గత రెండు రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు దశలవారీ ఆందోళనలు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు .
దీంట్లో భాగంగా ఈరోజు ఫ్యాఫ్టో పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నివ్వడంతో ముట్టడికి వచ్చే ఉపాధ్యాయులను పోలీసులు నిలవరిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్కు 200 మీటర్ల దూరం నుంచి పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను లోనికి అనుమతించకుండా నిలువరించారు. విశాఖ కేజీహెచ్ ఔట్గేట్, జిల్లా పరిషత్ నుంచి ర్యాలీకి సిద్ధమైన ఉపాధ్యాయులు కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళన చేశారు.
శ్రీకాకుళంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంను ముందస్తు అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబు రావు, గౌరవాధ్యక్షుడు భాస్కరరావు గృహ నిర్బంధం చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. నెల్లూరు లో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్కు తరలించడంతో పోలీసు స్టేషన్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయుల ఆందోళనకు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.