హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నరు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చద్దర్లు కూడా సల్లగై పోతున్నయ్. చలి నుంచి కాపాడుకోవడానికి నట్టింట్లోనూ చలి మంటలు వేసుకొంటున్నారు. గురువారం 21 జిల్లాలో 7 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల 7.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఉదయం వరకు తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చలిగాలులు దిశ మార్చుకొని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తుండడంతో శుక్రవారం నుంచి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 12.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. చలి తీవ్రతను తట్టుకోలేక నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని యాచకుడు (50) మృతిచెందాడు.