హైదరాబాద్: తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు(Durga) అన్ని విధాలా అండగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. నిర్మల్ జిల్లా(Nirmal Dist) తానూర్ మండలం బేల్తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.
విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.