హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులకు (Ministers) ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. రేవంత్తోపాటు (Revanth Reddy) 11 మంది మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మూడురోజులవుతున్నా శాఖలు కేటాయించకపోవడంతో ఇప్పటివరకు మంత్రులెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఇదేవిషయమై ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం రేవంత్.. శనివారం ఉదయం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.
భట్టివిక్రమార్క- ఆర్థిక, విద్యుత్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాలు
శ్రీధర్బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ
జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటక శాఖ
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్- రవాణా, బీసీ సంక్షేమం
సీతక్క- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్
కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ