హైదరాబాద్ : కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రగతిభవన్లో శుక్రవారం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాల్లో జిల్లాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా సమసి పోలేదన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను అన్వేషించాలన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలన్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నివేదికను సిద్ధం చేసి కేబినెట్కు సమర్పించాలని చెప్పారు. జిల్లాల్లో కరోనా విస్తరణకు ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు. కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలని చెప్పారు. ఇందుకు స్థానిక కలెక్టర్లు, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎంహెచ్ దవాఖానా సూపరింటెండెంట్లతో సహా సంబంధిత అధికారులను సమావేశ పరిచి అప్రమత్తం చేయాలన్నారు.
‘దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలు ఎవరూ గుర్తించలేకపోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తున్నది. దాన్ని కట్టడి చేయాలన్నా, ముందస్తుగా నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైంది. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంత వరకు విస్తరిస్తదో తెలియట్లేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అవుతుంది. కరోనా రోగ కారణం, దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉన్నది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరమున్నది. కరోనా నియంత్రణకోసం నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ల పేరుతో, వేవ్ల రూపంలో దశల వారీగా కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలను కరోనా భారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలె’ అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మందులు ఇంజక్షన్ల లభ్యత సక్రమంగా ఉన్నదా? సకాలంలో సరఫరా అవుతున్నవా? బెడ్లు, ఆక్సీజన్ అందుబాటులో ఉన్నవా? అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. రాష్ట్రం ఇప్పటికే అమలు చేసిన జ్వర సర్వే ద్వారా కరోనాను ముందస్తుగా కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఇప్పటికే నిర్వహించి సత్పలితాలను రాబట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే కార్యక్రమాన్ని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కరోనా మరో వేవ్ వస్తుందంటూ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, కరోనా నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా నియంత్రణ కోసం చేయదగ్గ పని పనేంటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేసి సఫలీకృతం కావాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వంతో కలిసి రావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్య పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని.. తద్వారా కూడా కరోనా కట్టడి చేయగలిగామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఏర్పాటుకు సంబంధించిన చర్యల గురించి సీఎం ఆరా తీశారు. నూతన దవాఖానను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవలకు వరంగల్కు తరలేలా ఉండాలన్నారు. అన్ని విభాగాలతో కూడిన సమీకృత భవన సముదాయంగా నూతన ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ఆదేశించారు.
సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి, కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సీఎం ఓఎస్డీ తాడూరి గంగాధర్, మెడికల్ కార్పోరేషన్ ఎండీ కట్టా చంద్రశేఖర్ రెడ్డి, వైద్యవిద్యా సంచాలకులు కే రమేశ్ రెడ్డి, హెల్త్ డైరక్టర్ జీ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ బి. కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.