Viral News : కోమాలో ఉన్న భర్త వీర్యం (Sperm) కోసం ఓ భార్య ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ను ఆశ్రయించింది. తన భర్త 2025 మార్చి నెల నుంచి కోమాలో ఉన్నాడని, భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లిని అయ్యేందుకు వీర్యం కావాలని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరింది. పిటిషనర్ తరఫున ఆమె న్యాయవాది అర్జిత్ గౌర్ (Ajit Gaur) వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన మహిళ భర్త 2025 మార్చిలో తలకు గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అతడు వెంటిలేటర్ సపోర్టుపై ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భవిష్యత్తులో తన భర్త ద్వారా తాను తల్లిని కావడం కోసం కోమాలో ఉన్న తన భర్త వీర్యాన్ని సేకరించి, నిలువచేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరింది. పిటిషనర్ తరఫున అర్జిత్ గౌర్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే తన భర్త ప్రస్తుత కండిషన్ నేపథ్యంలో వీర్య సేకరణ సురక్షితమా.. కాదా..? అనేది నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు. సర్జికల్ విధానంలో వీర్యాన్ని నేరుగా టెస్టికల్స్ నుంచి ఫైన్ నీడిల్తో సేకరించాలని ఐవీఎఫ్ ఎక్స్పర్ట్ డాక్టర్ శివాని సచ్దేవ్ చెప్పారు. కాగా ప్రస్తుత చట్ట ప్రకారం.. వీర్యాన్ని సేకరించి నిలువచేయడానికి భర్త, భార్య ఇద్దరి అంగీకారం అవసరం. ముందస్తు ఆమోదం ఉంటే మరణించిన భర్త నుంచి కూడా వీర్య సేకరణ చేయవచ్చు. కానీ ఈ కేసు ఆ రెండింటికి భిన్నమైనది కావడంతో క్లిష్టంగా మారింది. కేసు తదుపరి విచారణ గురువారం జరుగనుంది.