హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారని చెప్పి ఆ వాహనాన్ని మోటరు వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ‘వాహనానికి సంబంధించి తగిన పత్రాలు చూపితే సీజ్ చేయడానికి వీల్లేదు. వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించినట్టు నిర్ధారణ అయితే, ఆ వాహనాన్ని నడిపేందుకు అనుమతించకూడదు. అదే వాహనంలో మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాహనాన్ని అతనికి అప్పగించాలి. ఒకవేళ మరో వ్యక్తి లేనప్పుడు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి సమీప బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
ఈ పరిస్థితులు లేనప్పుడు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే దాని యజమాని, ధ్రువీకరించిన వ్యక్తి ఆర్సీ, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపితే వాహనాన్ని అప్పగించాలి..’ అని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కీలక ఉత్తర్వులను జారీచేశారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పట్టుబడితే రూల్స్ను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు నమోదై వాహనాలను స్వాధీనం చేసుకునేటప్పుడు రవాణా శాఖ నిబంధనల్లోని 148 సెక్షన్ను విధిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మూడు రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2025లో సాయిరాంరావు అనే వ్యక్తి మద్యం సేవించి నడిపిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన జే విజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి పై ఉత్తర్వులు జారీ చేశారు.